యాప్నగరం

జగన్, పవన్ ..టీడీపీని ఇరికించారా?

కేంద్ర బడ్జెట్ అనంతర రాజకీయ పరిణామాల్లో ఏపీ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

TNN 19 Feb 2018, 11:48 am
కేంద్ర బడ్జెట్ అనంతర రాజకీయ పరిణామాల్లో ఏపీ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇరవై రోజుల నుంచి ఒకే హీట్ మీద కొనసాగుతున్న ఈ రాజకీయాలు.. ఇప్పుడు రాజీనామా ప్రకటనలు, అవిశ్వాస తీర్మానాల వరకూ వచ్చాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, ఇంకో వైపు వైఎస్సార్ కాంగ్రెస్, మధ్యలో పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ.. భిన్నమైన ప్రకటనలు, సవాళ్లతో రాజకీయం రసవత్తరంగా మారింది.
Samayam Telugu tdp cornered by jagan and pawan
జగన్, పవన్ ..టీడీపీని ఇరికించారా?


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోంది అని తెలుగుదేశం అంటోంది. అయితే.. భారతీయ జనతా పార్టీ ఆ మాటతో ఏకీభవించడం లేదు. ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో తమ లెక్కలు తాము చెబుతున్నారు. అయితే అవన్నీ అబద్ధాలన్నట్టుగా తెలుగుదేశం వాళ్లు స్పందిస్తున్నారు. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కొనసాగుతోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు కొనసాగుతూ ఉన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం మాత్రం నిరసన తెలుపుతూ ఉంది. ఎన్డీయే నుంచి బయటకు రావడానికి తెలుగుదేశం పార్టీ అంత ఇష్టపడుతున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. రాష్ట్రానికి దక్కే నామమాత్రపు సాయం కూడా దక్కదనేది తెలుగుదేశం వాదనగా కనిపిస్తోంది. అయితే.. కేంద్ర సర్కార్ అన్యాయం చేయడం మాత్రం నిజమని టీడీపీ వాళ్లు మరోవైపు వాదిస్తూ ఉన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుత పరిణామాలపై జేఎఫ్‌సీ తరఫున స్పందిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని అంటే.. ఆ విషయాన్ని తేలిక చేశారు పవన్. ఒక దశలో ఏపీ కోసం ఎంపీలు రాజీనామా చేస్తే.. వారిని తాను గెలిపిస్తాను అని ప్రకటించిన పవన్ ఇప్పుడు.. రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని అంటుండటం గమనార్హం.

రాజీనామాలతో ప్రయోజనం లేదని, చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని.. ఏపీలోని టీడీపీ, వైకాపాలకు పవన్ సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తక్షణం స్పందించింది. రానున్న సమావేశాల్లోనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని కూడా వైకాపా అధినేత ప్రకటించేశారు. ‘పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి.. టీడీపీని కూడా అవిశ్వాస తీర్మానానికి ఒప్పించండి..’ ని కూడా జగన్ వ్యాఖ్యానించారు.

మరి వైకాపా చిత్తశుద్ధిని పవన్ కల్యాణ్ ప్రశ్నించగా, ఆ పార్టీ స్పందించేసింది. ముందు అవిశ్వాస తీర్మానం, తర్వాత రాజీనామాలు అని.. వైకాపా ప్రకటించింది. పవన్ సవాల్ విసిరారు, వైకాపా వాళ్లు స్పందించేశారు. ఇప్పుడు స్పందించాల్సింది తెలుగుదేశం పార్టీనే! ఈ విధంగా పవన్, జగన్ తమ ప్రకటనలతో.. తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేశారు. ఇప్పటి వరకూ ఏపీ కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు అంటుండగా.. టీడీపీ ఈ విషయంలో ఎదురుదాడి చేస్తూ వస్తోంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో ఏమంటుందో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.