యాప్నగరం

కిషన్ రెడ్డిని కలిసిన వల్లభనేని వంశీ.. బీజేపీలో చేరతారా? నిజం ఇదేనా?

టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ రూమర్ల పట్ల వంశీ స్పందించారు.

Samayam Telugu 8 Jul 2019, 7:50 pm
బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించడంతో ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకొంటున్నారు. టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితులైన నేతలు కూడా తమ పార్టీలో చేరబోతున్నారని కమలనాథులు చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీలో ఉండేదెవరో తెలీక టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu Vallabhaneni


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశీని బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కిషన్ రెడ్డిని కూడా ఆయన కలవడంతో.. వంశీ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

తాను బీజేపీలో చేరబోతున్న వస్తోన్న వార్తలను వల్లభనేని వంశీ ఖండించారు. గన్నవరం నియోజకవర్గం పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేవలం మర్యాదపూర్వకంగానే తాను కలిశానని వంశీ చెబుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కుటుంబానికి చెందిన స్వర్ణ భారత్ తన నియోజకవర్గం పరిధిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని.. ఆ ట్రస్ట్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను హాజరవుతున్నాని.. బీజేపీతో టీడీపీకి దూరం పెరిగాక కూడా.. తాను స్వర్ణ భారత్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన తెలిపారు.

నేను ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి, టీడీపీకి విధేయుడిగా ఉంటానని వంశీ తెలిపారు. నాపై దుష్ప్రచారం చేయొద్దని ఆయన ట్వీట్ చేశారు. జై చంద్రబాబు అంటూ సోషల్ మీడియాల పోస్ట్ చేశారు. కానీ ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని, కానీ బయటపడటం లేదనే ప్రచారం మాత్రం జోరందుకోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.