యాప్నగరం

సిగ్గుతో తలదించుకున్న ఎమ్మెల్సీ మూర్తి!

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ‘దెయ్యాల కొంప’గా అభివర్ణించిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మహానాడు నిండు సభలో సిగ్గుతో తలదించుకున్నారు.

TNN 28 May 2017, 4:19 pm
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ‘దెయ్యాల కొంప’గా అభివర్ణించిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మహానాడు నిండు సభలో సిగ్గుతో తలదించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సభాముఖంగా తన వ్యాఖ్యలకు మూర్తి క్షమాపణలు చెప్పారు. ఉన్నత స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నానని, తన తప్పునకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానన్నారు.
Samayam Telugu tdp mlc murthy apologies for his derogatory comment on andhra university
సిగ్గుతో తలదించుకున్న ఎమ్మెల్సీ మూర్తి!


ఆదివారం ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడు సభలో ముందుగా ఎన్టీఆర్ జన్మదిన తీర్మానంపై మూర్తి రెండు నిమిషాలు మాట్లాడారు. అనంతరం వేదిక దిగి వెళ్లిపోతుండగా.. చంద్రబాబు కలుగజేసుకుని ఏయూ గురించి అని మూర్తికి గుర్తుచేశారు. వెంటనే మైకందుకున్న మూర్తి.. ఏయూ తనకు కన్నతల్లి వంటిదని, తనకు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన విషయంగా ఏయూ వర్గాలు పరిగణించాలని కోరారు. తన వ్యాఖ్యలపై ఏయూ వీసీతో పాటు ఉద్యోగులు, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.

కాగా.. గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మూర్తి, తన విద్యాసంస్థ ప్రతిష్ట పెంచుకునేందుకు ఏయూపై బురద చల్లడానికి చూస్తున్నారని రెండు రోజులగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు.. మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఆదేశాల మేరకే మూర్తి మహానాడు వేదికగా క్షమాపణలు చెప్పారట. చంద్రబాబు కూడా మహానాడు వేదికపై ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తాను మూర్తిని మందలించానని, క్షమాపణలు చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శమని చంద్రబాబు కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.