యాప్నగరం

జేసీ దివాకర్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు!

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు తను హాజరు కాను అని ప్రకటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారు.

Samayam Telugu 19 Jul 2018, 6:47 pm
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు తను హాజరు కాను అని ప్రకటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీ రేపు సభకు హాజరు అవుతాను అని ప్రకటించారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తలనొప్పిని తగ్గించారు. అయితే ఇదే సమయంలో జేసీ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదేమిటంటే.. రేపు అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు హాజరై, ఓటింగ్ జరిగితే అందులో కూడా పాల్గొని.. ఆపై ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని దివాకర్ రెడ్డి ప్రకటించారు.
Samayam Telugu jcd


తనకు టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దక్కినంతటి ప్రాధాన్యత కూడా తనకు దక్కడం లేదని జేసీ వాపోతున్నారు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని, రేపు ఎంపీ పదవికి రాజీనామా చేసి లేఖను స్పీకర్ కు ఇచ్చి వస్తానని జేసీ ప్రకటించారు. హాజరవుతానని ప్రకటిస్తూనే దివాకర్ రెడ్డి ఇలా మరో ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

అయితే జేసీ దివాకర్ రెడ్డి నిజంగానే రాజీనామా చేస్తారా? అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే నిన్నేమో అసలు తను సభకు హాజరుకాను అన్నారు. ఈ సమావేశాలంతా తను సభకు దూరం అవుతానని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాట మార్చారు. మరి రేపు రాజీనామా విషయంలో కూడా జేసీ ఇంకో మాట చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

రాజీనామా సంగతలా ఉంచితే... జేసీ దివాకర్ రెడ్డి రేపు లోక్‌సభకు హాజరవుతాను, ఓటింగ్ జరిగితే అందులో కూడా పాల్గొంటాను అని ప్రకటించడం మాత్రం తెలుగుదేశం పార్టీకి ఊరటగా మారింది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.