యాప్నగరం

డెంగీ జ్వరంతో ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.

TNN 7 Feb 2018, 9:21 am
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరవాత 2.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. మూడు నెలల కిందటే ముద్దుకృష్ణమ గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. గాలి మరణంతో ఆయన కుటంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు టీడీపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుకృష్ణమ మరణం పార్టీకి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu tdp senior leader muddu krishnama naidu passes away
డెంగీ జ్వరంతో ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత


ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి పలు ఉన్నతమైన పదవులు చేపట్టిన ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జన్మించారు. జి.రామానాయుడు, రాజమ్మ దంపతులు ముద్దుకృష్ణమ తల్లిదండ్రులు. బీఎస్సీ, ఎంఏతో పాటు లా పూర్తిచేసిన ముద్దుకృష్ణమ.. స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా రికార్డు..
పుత్తూరు నియోజకవర్గం నుంచి ముద్దుకృష్ణమనాయుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డులకెక్కారు. 1984లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గాలి.. 1987లో అటవీశాఖ, 1994లో ఉన్నత విద్యా శాఖలను నిర్వర్తించారు. ఆ తరవాత తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2008లో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో పుత్తూరు నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. పార్టీకి విశేష సేవలందించిన ముద్దుకృష్ణమ మరణాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థీవ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.