యాప్నగరం

ఇక యుద్ధమేనా..? బీజేపీతో టీడీపీ తెగదెంపులు?

బీజేపీ, టీడీపీల మధ్య ఇటీవల దూరం పెరుగుతోంది. బడ్జెట్ తర్వాత.. బీజేపీతో తెగదెంపుల దిశగా టీడీపీ తీవ్రంగా ఆలోచిస్తోంది.

TNN 2 Feb 2018, 4:55 pm
కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపడం పట్ల ఆంధ్రా సర్కారు గుర్రుగా ఉంది. ఎన్డీయే సర్కారులో మిత్రపక్షంగా కొనసాగతున్నప్పటికీ.. తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగడంపై ఎంపీ టీజీ వెంకటేశ్ ఘాటుగా స్పందించారు. తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒకటి.. బీజేపీతో పొత్తును కొనసాగించడానికి ప్రయత్నించడం, రెండోది ఎంపీలు రాజీనామా చేయడం. మూడోది కూటమి నుంచి బయటకు వచ్చేయడం. అంటే కమలం పార్టీతో తెగతెంపులని ఆయన చెప్పారు.
Samayam Telugu tdp unhappy over raw deal to andhra pradesh mulls breaking of alliance with bjp
ఇక యుద్ధమేనా..? బీజేపీతో టీడీపీ తెగదెంపులు?


ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం ఈ విషయమై ఓ నిర్ణయానికి వస్తామని టీజీ తెలిపారు. మరో వైపు చంద్రబాబు కూడా ఏపీకి తగిన కేటాయింపులు జరపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చకపోవడంపై పట్ల ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి మంత్రులతో చర్చించారు.

మంత్రి సోమిరెడ్డి చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంలో నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడికే వదిలేస్తున్నామన్నారు. విభజనతో ఏపీ కష్టాల్లో పడింది. గత నాలుగేళ్లుగా సాయం కోసం వేచి చూస్తున్నాం. కానీ బీజేపీ మాత్రం తగిన విధంగా స్పందించడం లేదన్నారు.

గత నెలలలోనే చంద్రబాబు నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రం సమస్యలను వివరించారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం పట్ల ఇటీవలే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం వారిని నియంత్రించాలని సూచించారు. కమలం పార్టీకి ఇష్టం లేకపోతే.. తమ దారి తాము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మిత్ర ధర్మం ప్రకారం మౌనంగా ఉంటున్నామని, వారు వద్దనుకుంటే నమస్కారం పెడతామని చంద్రబాబు చెప్పారు. వైసీపీతో పొత్తుకు సిద్ధమని రాష్ట్ర బీజేపీ నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం ప్రతిపక్ష వైసీపీ కూడా సంకేతాలు పంపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలంతో టీడీపీ తెగతెంపులు చేసుకుంటుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.