యాప్నగరం

టీడీపీ vs వైఎస్సార్సీపీ, అభ్యర్థులు మారారు!

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి.. ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతున్నారు.

Samayam Telugu 21 Mar 2018, 11:14 am
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి.. ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఈ సారి తెలుగుదేశం అభ్యర్థి కాబోతున్నారు. ఇదీ తేడా. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఆసక్తిదాయకమైన మార్పు చోటు చేసుకుంది. గత ఎన్నికలో తలపడిన రెండు పార్టీలూ ఈ సారి అభ్యర్థులను మార్చుకుని తలపడుతున్నాయి. దీంతో ఈ సారి ఈ నియోజకవర్గం ఫలితం మరింత ఆసక్తిదాయకంగా మారే అవకాశం ఉంది.
Samayam Telugu tdpysrcp


2014 సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇక్కడ జ్యోతుల చంటిబాబు పోటీ చేశారు. వీరి పోరాటంలో వైకాపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయం సాధించారు. ఆయనకు వైసీపీలో మంచి ప్రాధాన్యతే దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేతగా అవకాశం ఇచ్చారు. అయితే.. ఆయన అనూహ్యంగా ఫిరాయింపుకు పాల్పడ్డారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. అదలా ఉంటే.. నియోజకవర్గంలోని టీడీపీ పాత నేతలతో నెహ్రూ వర్గానికి పొసగలేదు. గత ఎన్నికల్లో నెహ్రూ చేతిలో ఓడిపోయిన జ్యోతుల చంటి బాబు విబేధాలు తారాస్థాయికి వెళ్లాయి. ఈ పరిణామాల మధ్యన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతుల నెహ్రూకే ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

దీంతో చంటిబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. ఈ నేపథ్యంలో చంటిబాబు వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారట జగన్. దీంతో ఇటు అభ్యర్థి అటు, అటు అభ్యర్థి ఇటు.. వచ్చినట్టైంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.