యాప్నగరం

అధికారంలోకి వస్తే అవినీతిరహిత పాలన, టీడీపీకి 40 సీట్లే, పవన్‌కూ భాగం: జగన్

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లు మాత్రమే వస్తాయి. కావాలంటే రాసిపెట్టుకోమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పారు.

Samayam Telugu 18 Jul 2018, 11:44 am
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లు మాత్రమే వస్తాయి. కావాలంటే రాసిపెట్టుకోమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఆయన తెలిపారు. పవన్, మోదీ ఫ్యాక్టర్ల వల్ల గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తున్నారని జగన్ ఆరోపించారు. మంగళవారం ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పలు అంశాలపై స్పందించారు.
Samayam Telugu YS-Jagan-1


జనసేన పార్టీతో పొత్తు విషయం ఇంకా ఆలోచించలేదంటూనే.. పవన్ పార్టీతో పొత్తు అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పవన్‌ను ప్రేమించిన ప్రతి వ్యక్తి బాబుకు ఓటేశారు. ఈసారి ఆ ఓట్లు పవన్‌కు, నాకు పడతాయి. మా ఓట్ల శాతానికి ఇది జత కలుస్తుందన్నారు. బాబు, మోదీ చేసిన మోసంలో పవన్‌కు కూడా బాధ్యత ఉందని జగన్ విమర్శించారు. ఏపీని చంద్రబాబు, బీజేపీ, పవన్ కలిసి మోసం చేశారని ఆయన ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు గళం వినిపించానని జగన్ తెలిపారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. మా ఎంపీలు రాజీనామాలు చేశారని జగన్ గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రిజైన్ చేసి ఉంటే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు. బీజేపీతో లాలూచీ పడ్డామని వస్తోన్న ఆరోపణలను జగన్ ఖండించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలను పక్కనబెడతా. ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని జగన్ పునరుద్ఘాటించారు.

చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటారా అనే ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో బదులిచ్చారు. ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవాలనే గుణం నాలో లేదు. ఏదైనా తప్పు జరిగితే దానిపై విచారణ జరగాలి. అధికారంలోకి వచ్చాక తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తాం, విచారణ చేయదగ్గ అంశాలపై విచారణ జరిపిస్తామని జగన్ తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు తర్వాతే ఎవరైనా అని జగన్ ఎద్దేవా చేశారు. స్టేలు తెచ్చుకోవడమంటే.. తప్పులు చేయలేదని నిరూపించుకున్నట్టు కాదని జగన్ చెప్పారు.

నేను అధికారంలోకి వస్తే అవినీతి లేకుండా చేస్తాను. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని జగన్ తెలిపారు. లక్షల కోట్లు దోచానని అభాండాలు వేస్తున్నారు. నా ఆరోపణలు చేసేవాళ్లు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. వైఎస్ సీఎంగా ఉన్న టైంలో నేను హైదరాబాద్‌లోనే లేను. కావాలనే నా మీద బురద జల్లుతున్నారని జగన్ వాపోయారు. దేవుడు ఆశీర్వదించి, ప్రజలు దీవించినప్పుడు కచ్చితంగా అధికారంలోకి వస్తానని జగన్ చెప్పారు. అది 2019లో లేదంటే 2018లోనే జరగొచ్చేమోనని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంటల విస్తీర్ణం తగ్గుతోందని విమర్శించిన జగన్.. రైతు రుణమాఫీని మోసంగా అభివర్ణించారు. పంటలకు మద్దతు ధర పెంపు కోసం చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా లేఖ రాయలేదని మండి పడ్డారు. రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఎక్కడని జగన్ నిలదీశారు. సర్కారు పాఠశాలల మూసివేత దిశగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడుగులేస్తోందని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని జగన్ తెలిపారు. నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు అన్ని అంశాల్లోనూ విఫలమైందని ప్రతిపక్ష నేత దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.