యాప్నగరం

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలయ్యింది.

Samayam Telugu 22 Mar 2019, 10:16 am
ఏపీ, తెలంగాణలోని మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలయ్యింది. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు, తెలంగాణలో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. ఏపీలోని ఈ ఎన్నికల్లో మొత్తం 5,62,186 మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. మూడు చోట్ల కలిపి మొత్తంగా 94 మంది పోటీ పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 817 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Samayam Telugu mlc-elections_3


మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్; వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీని తెలుసుకుని అక్కడికి వెళ్లేందుకు వీలుగా మై ఓటు క్యూ యాప్‌ను కూడా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గ పరిధి ఓటర్లకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను ప్రకటించారు. ఓటరు జాబితాలో పేరుండి.. ఫోటో ఓటరు గుర్తింపు కార్డులేనివారు ప్రత్యామ్నాయంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు, విద్యాసంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, విశ్వవిద్యాలయం జారీచేసిన ఒరిజినల్‌ డిగ్రీ, అధికృత అధికారి జారీ చేసిన వికలాంగుల ధ్రువపత్రం, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించి ఓటువేసే అవకాశం కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.