యాప్నగరం

చంద్రబాబుకు బురదజల్లడం అలవాటే: లక్ష్మణ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి, దాడికి గల కారణాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Samayam Telugu 26 Oct 2018, 5:15 pm
ప్రతిపక్ష పార్టీలపై బురదజల్లడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం రాజకీయ నాయకులకు పూర్తి భద్రత, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడికే అక్కడ భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
Samayam Telugu Laxman


ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, దాడికి గల కారణాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాగా, జగన్‌పై దాడి ఆపరేషన్ గరుడలో భాగంగానే జరిగిందని వస్తోన్న ఆరోపణలపై స్పందించాల్సిందిగా లక్ష్మణ్‌ను ఓ రిపోర్టర్ కోరారు. దీనిపై లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ఏ సంఘటన జరిగినా అవతల వాళ్ల మీద బుదరజల్లే కార్యక్రమం చంద్రబాబు చేస్తారు. ప్రతిపక్ష పార్టీ నేత మీద దాడి జరిగినా, పన్నులు కట్టనివారిపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగినా వాటికి రాజకీయ రంగు పులమడం చంద్రబాబుకే చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నులు ఎగ్గొడితే దర్యాప్తు జరపకూడదు. ప్రతిపక్ష పార్టీ నేతపై దాడి జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది పోయి ఎదురుదాడి చేయడమేంటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు’ అని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.