యాప్నగరం

KCR Visakha Visit: శారదా పీఠం నుంచి ఆహ్వానం.. మరోసారి విశాఖకు కేసీఆర్!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత మొక్కులు తీర్చుకోడానికి విశాఖపట్నంలోని శారదాపీఠాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 29 Jan 2019, 10:47 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనకు విశాఖలోని శారదాపీఠం నుంచి ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్తారు. ఫిబ్రవరి 14న శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాన కార్యక్రమం నిర్వహిస్తుండగా, దీనికి హాజరు కావాలని పీఠం నిర్వాహకులు కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించినట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇదే రోజున మంచి ముహూర్తం ఉండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం తన అమరావతిలో నూతన గృహప్రవేశం చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రావాలని కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందింది. దీంతో కేసీఆర్ ఏపీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Samayam Telugu kcr


ఈ రెండు కార్యక్రమాలకూ ఆయన హాజరవుతారా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. తెలంగాణ ఎన్నికల్లో విజయం అనంతరం డిసెంబరులో విశాఖపట్నంలోని శారదాపీఠాన్ని కేసీఆర్ కుటుంబసమేతంగా సందర్శించారు. పీఠంలోని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, విశాఖ నుంచే ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. విశాఖ నుంచి ఒడిశా, అక్కడ నుంచి పశ్చిమ్ బెంగాల్, కోల్‌కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయా ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చించారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు ప్రాధాన్యత గురించి వారికి వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.