బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. హైదరాబాదులోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆయన బ్రాహ్మణుల సంక్షేమం గురించి సమీక్షించారు. తెలంగాణ ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుండాలంటే బ్రాహ్మణుల పాత్ర ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేదలను పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే హైదరాబాదులో బ్రాహ్మణ విద్యార్థులకు వసతి గృహం నిర్మించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దాదాపు పన్నెండు ఎకరాల్లో అతిపెద్దదయిన బ్రాహ్మణ సదనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సదనంలో తెలంగాణతో పాటు దేశ విదేశాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు, బ్రాహ్మణ పెద్దలకు వసతి కల్పిస్తామన్నారు. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు కూడా ఇస్తామని వెల్లడించారు. దేవాలయాల్లోని బ్రాహ్మణులకు ఇస్తున్న జీతాలు, ఇతర భత్యాలను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బడ్జెట్లో రూ.100 కోట్లను బ్రాహ్మణుల సంక్షేమానికి కేటాయించామని, వాటితో బ్రాహ్మణ ట్రస్ట్ నెలకొల్పి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
బ్రాహ్మణుల సంక్షేమంపై కేసీఆర్ సమీక్ష
బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు
TNN 24 Oct 2016, 4:28 am