యాప్నగరం

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనల పర్వం.. కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళన నిర్వహించాయి. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Samayam Telugu 11 Jun 2019, 8:58 pm
కాంగ్రెస్ నిరసనల పర్వంతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళన నిర్వహించాయి. టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
Samayam Telugu Jangaon
జనగామలో కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన


అధికార టీఆర్‌‌ఎస్ పార్టీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తమ పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడుతున్నారు.

టీఆర్‌ఎస్ తీరుకు నిరసనగా మల్లు భట్టి విక్రమార్క నిరాహార దీక్షకు దిగారు. సోమవారం పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన దీక్ష విరమించారు. భట్టి విక్రమార్కకు సంఘీభావంగా కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి.

జనగామ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ‘కేసీఆర్ అరాచక పాలనను అంతమొందిద్దాం..’, ‘సీఎం పీఛమనుద్దాం’ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.