యాప్నగరం

ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు.. జనగామ వాసి వినూత్న ప్రచారం!

తొమ్మిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దు కావడంతో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Samayam Telugu 9 Sep 2018, 8:41 am
తొమ్మిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దు కావడంతో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్‌లో అప్పుడే టిక్కెట్ల లొల్లి మొదలైపోయింది. సభను రద్దుచేసిన రోజే 14 స్థానాలకు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారుచేసింది. తర్వాతి రోజు నుంచే ప్రచారం మొదలు పెట్టింది. ప్రజల్లోకి వెళ్లిపోయి ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ హుస్నాబాద్‌‌లో సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్‌ను నిలువరించడానికి తమతో కలిసొచ్చే పార్టీలకు కాంగ్రెస్ సంకేతాలు పంపుతోంది. తాము టీడీపీతో పొత్తుకు సిద్ధమని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక అసలైన రాజకీయం మొదలవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి వివిధ పార్టీలు తాయిళాలు ప్రకటించి, ప్రలోభాల పర్వానికి తీరతీస్తాయి.
Samayam Telugu వాల్ పెయింటింగ్


రాజకీయ నేతల ఎత్తుగడలను ముందే ఊహించిన ఓ వ్యక్తి.. ఓట్ల కోసం తన ఇంటికి ఎవరూ రావొద్దంటూ గోడమీద పెయింటింగ్ వేయించారు. జనగామ జిల్లా కోమళ్లకు చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి... తన ఇంటికి ఎవరూ రావద్దని, తాము అమ్ముడుపోనంటూ గోడపై రాయించాడు. అటువైపుగా వెళ్లినవారి ఈ పెయింటింగ్ ఆకట్టుకుంటోంది. ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉండగా కింద తన పేరు రాశారు. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు.. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. ఓడిపోయి(అమ్ముడుపోయి) బానిసలవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది’ అంటూ అంబేద్కర్ సూక్తిని కింద ప్రస్తావించారు. మరి ఎన్నికల వేళ నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఓట్లడిగే సాహసం చేస్తారా?.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.