యాప్నగరం

వెంకయ్యకు ఘనంగా ‘పౌరసన్మానం’

ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన వెంకయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 21) ఘనంగా సన్మానించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయనకు పౌరసన్మానం చేశారు. రాజ్‌భవన్‌లో..

TNN 21 Aug 2017, 4:40 pm
ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన వెంకయ్యనాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 21) ఘనంగా సన్మానించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయనకు పౌరసన్మానం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా సీఎం కేసీఆర్, గవర్నర్‌ నరసింహన్‌.. వెంకయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాడ్లాడుతూ.. వెంకయ్యనాయుడు అద్భుతమైన వక్త అని కితాబిచ్చారు. ఆయన గురించి తెలియని వారు ఎవరూ లేరని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానానికి వచ్చారని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అని పేర్కొన్న కేసీఆర్ ఆయనను గౌరవించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu telangana govt accords civic reception for vice president venkaiah naidu
వెంకయ్యకు ఘనంగా ‘పౌరసన్మానం’


ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున వెంకయ్యకు కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య దేశంలో రెండో అత్యున్నత శిఖరం అధిరోహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవం దక్కింది. మళ్లీ ఇప్పుడు తెలుగు వ్యక్తి ఉప రాష్ర్టపతిగా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయం. దేశంలోనే వెంకయ్య అద్భుతమైన వక్త. తన మాటలతోనే వెంకయ్య అందరినీ అబ్బురపరుస్తారు. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారు’ అని కేసీఆర్ అన్నారు.

'80లలో నేను వెంకయ్యనాయుడును తొలిసారి చూశా. విద్యార్థి దశ పూర్తి చేసుకొని నేను విప్లవ రాజకీయాల వైపు ఆలోచిస్తున్న సందర్భం అది. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామితో కలిసి వెంకయ్యనాయుడు సిద్దిపేట వచ్చారు. అప్పుడు తొలిసారి ఆయన ఉపన్యాసాన్ని విన్నా. మొదట్లో ఆయన ఉపన్యాసంలో వ్యంగ్యం ఎక్కువగా కనిపించేది. ఆ తర్వాత వ్యంగ్యం, రౌద్రం, హాస్యం, లాలన పూరితమైన సామరస్యం అన్నీ సమపాళ్లలో కలిపి శ్రోతలను అలరించేవారు. ఆయన గొప్ప వక్తగా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది' అని కేసీఆర్‌ అన్నారు.

సన్మాన వేడుక అనంతరం వెంకయ్య.. కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దిల్‌కుషా అతిథి గృహ ప్రాంగణంలో వెంకయ్యనాయుడు గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్యకు గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఘన స్వాగతం పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.