యాప్నగరం

ఎమ్మెల్యేల బహిష్కరణ కేసు: మాజీ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసు

గత శాసనసభ కాలంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బహిష్కరణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నడూలేని విధంగా కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ శాసనసభ, న్యాయశాఖ కార్యదర్శులను అదుపులోకి తీసుకుంది.

Samayam Telugu 16 Feb 2019, 9:42 am
గత శాసనసభ కాలంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ శాసనసభ, న్యాయశాఖ కార్యదర్శులను హైకోర్టు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. అనంతరం రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించి ఇద్దరూ విడుదలయ్యారు. వీరితోపాటు నాటి స్పీకర్ మధుసూదనాచారి ప్రాథమికంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయననూ ప్రతివాదిగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అలాగే, నోటీసులు జారీచేసినా స్పందించలేదంటూ అప్పటి డీజీపీ, నల్గొండ, గద్వాల జిల్లాల ఎస్పీలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ ఫాం-1 నోటీసులు జారీ చేసింది.
Samayam Telugu Madhusudhana-Chary


అంతేకాదు, తదుపరి విచారణకు వీరందరూ హాజరవుతారని భావిస్తున్నట్లు పేర్కొన్న హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆర్టికల్- 136 కింద సుప్రీంకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించింది. శాసనసభ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారించిన జస్టిస్‌ బి.శివశంకరరావు కీలక ఆదేశాలు జారీచేశారు. గత వారం జారీ అయిన వారెంట్లను అమలు చేశామంటూ పోలీసు కమిషనర్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు.

స్పీకర్‌ మధుసూదనాచారి తమ ఉత్తర్వులను అమలు చేయకపోగా కోర్టు నోటీసులను తిరస్కరించడం ద్వారా ధిక్కరణకు పాల్పడ్డారన్న నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనతోపాటు డీజీపీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు జడ్జ్ పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.