ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పాలనను హైదరాబాదు నుండి విజయవాడకు మార్చడం గొప్ప నిర్ణయమని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత పాలన విజయవాడ నగరానికి తరలిరావడంతో నగరం దశతిరిగిందన్నారు. ప్రస్తుతం విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు అందరిని ఆకట్టుకుంటున్నదని చెప్పారు. విజయవాడలో ఒక వివాహానికి నాయిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమ దృష్టినంతా హైదరాబాదుపై నిలిపి, విజయవాడ లాంటి నగరాలను నిర్లక్ష్యం చేసారన్నారు. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పురావడం హర్షణీయమన్నారు. పరిపాలనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఏపీ సీఎం చక్కని రాజధాని నగరాన్ని ఆంధ్రులకు నిర్మిస్తున్నారన్నారు.
ఏపీ సీఎం మంచి రాజధాని కడుతున్నారు
పరిపాలన విజయవాడకు తరలడం గొప్ప నిర్ణయమని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు
TNN 18 Sep 2016, 7:01 pm