యాప్నగరం

పాలియేటివ్ కేర్ సెంటర్‌కు కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ (జూన్ 22) హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ‘పాలియేటివ్ కేర్ సెంటర్’కు శంకుస్థాపన చేశారు.

TNN 22 Jun 2017, 4:08 pm
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ (జూన్ 22) హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ‘పాలియేటివ్ కేర్ సెంటర్’కు శంకుస్థాపన చేశారు. 50 పడకలతో ఏర్పాటు చేయనున్న ఈ కేన్సర్ ఉపశమన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కాజాగూడలో ఎకరం భూమిని కేటాయించింది. ఈ కేర్ సెంటర్ నిర్వహణకు గాను స్పర్శ్ అనే సంస్థకు 33 ఏళ్ల పాటు ఈ భూమిని లీజుకు ఇచ్చారు. శంకుస్థాపన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడిన కేటీఆర్.. వక్తల ప్రశంసలకు ఆసక్తికరంగా బదులిచ్చారు. రికార్డు టైంలోనే భూమి కేటాయించి.. మంత్రి చాలా సహకారం అందించారని వక్తలు ప్రశంసలు కురిపించగా.. ఆ మాటలు వింటుంటే తాను అప్పుడే రిటైర్మెంట్ అవుతున్నట్లు అనిపిస్తోందని కేటీఆర్ చమత్కరించారు. సమీప భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలేవీ లేవని చెప్పి, సభలో నవ్వులు పూయించారు.
Samayam Telugu telangana it minister ktr lays foundation stone for palliative care center
పాలియేటివ్ కేర్ సెంటర్‌కు కేటీఆర్ శంకుస్థాపన


కేన్సర్ వ్యాధిగ్రస్థుల చికిత్సకు తోడ్పడే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం.. కఠిన నిబంధనలను సరళతరం చేసే దిశగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కేన్సర్ రోగులకు ఉపశమనం కల్పించడానికి స్పర్శ్ ట్రస్టీ సభ్యులు ముందుకు రావడాన్ని ఆయన ప్రశంసించారు.

‘పనులు ఎంత వేగంగా చేద్దామనుకున్నా.. కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. కొంత మంది అధికారులు మమ్మల్ని అయిదేళ్లకోసారి వచ్చిపోయే అతిథులుగా భావిస్తున్నారు. వాళ్లు మాత్రం శాశ్వతంగా ఉంటామని అనుకుంటున్నారు. మఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడూ నిర్దేశిస్తున్నా.. ఇలాంటి అధికారుల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కేర్ సెంటర్ కార్యకలాపాల కోసం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ప్రభాకర్ రావు, కుసుమ కుమారి దంపతులు కేన్సర్‌తో మరణించిన తమ కుమారుడి పేరు మీద రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. రెయిన్ బో ఆసుపత్రుల అధినేత రమేశ్ బాబు రూ. 30 లక్షల వ్యయంతో మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనిస్తామని హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.