యాప్నగరం

తహసీల్దార్‌కు లంచం ఇచ్చేందుకు భిక్షాటన

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని శుక్రవారం భూపాలపల్లిలో భిక్షాటన చేశారు.

Samayam Telugu 31 Jan 2019, 12:39 pm

ప్రధానాంశాలు:

  • తహసీల్దార్‌కు లంచం ఇచ్చేందుకు వయసుమీరిన దంపతులు భిక్షాటనకు చేపట్టారు.
  • ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.
  • ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి లంచం. ప్రభుత్వాలు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా, లంచం తీసుకోవడం నేరమని చట్టాలు చెబుతున్నా అక్రమార్కులకు అవేమీ పట్టవు. నిరుపేదలు, వృద్ధులు ఎవరైనా సరే పని చేయాలంటే చేయి తడపాల్సిందే అన్నట్లుగా తయారయ్యాయి ప్రభుత్వ కార్యాలయాలు. పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ లంచం అడగగా.. ఆ డబ్బుకోసం వృద్ధ దంపతుల భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని శుక్రవారం భూపాలపల్లిలో భిక్షాటన చేశారు. ఈ వృద్ధ దంపతులు తమ 9 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాల కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ స్వర్ణలత వారికి పాసు పుస్తకాలు మంజూరు చేయాలని తహసీల్దారును ఆదేశించినా ఫలితం లేకపోయింది. లంచం ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తానని తహసీల్దారు చెప్పడంతో దంపతులు భిక్షాటనకు దిగారు.

‘తమ పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ లంచం అడుగుతున్నాడని, తాము ముసలివాళ్లం కావడంతో తగినంత డబ్బు లేదని, అందువల్ల లంచం ఇచ్చేందుకు బిచ్చం వేయండి’ అంటూ ఫ్లెక్సీతో ఆ దంపతులు భిక్షాటన చేశారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే ఆర్డీవోకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించి 4.10ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేశారు. మిగతా 5.07 ఎకరాల భూమి వివాదంలో ఉన్నందున పూర్తిగా పరిశీలించాకే పాసు పుస్తకం జారీచేస్తామని చెప్పారు. లంచగొండితనానికి ఈ దంపతులు సరైన పరిష్కారం చూపించారంటూ చాలామంది వారిని అభినందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.