యాప్నగరం

రేవంత్‌రెడ్డికి భద్రత ఉపసంహరణ

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కల్పిస్తోన్న 4+4 భద్రతను పోలీసు శాఖ ఉపసంహరించుకుంది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎన్నికలకు ముందు రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.

Samayam Telugu 13 Dec 2018, 8:45 am
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కల్పిస్తోన్న భద్రతను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది. ప్రచార సమయంలో తనపై దాడి జరిగే అవకాశం ఉందని, తనకు పొంచిఉన్న ప్రాణహాని దృష్ట్యా భద్రతను పెంచాలని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందుకు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సింగిల్ జడ్జి.. రేవంత్‌కు భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అపీల్‌కు వెళ్లింది. స్థానిక నేతలకు భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించాలని కోరింది.
Samayam Telugu Telugu-image


కేంద్ర హోంశాఖ అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆదేశించింది. 4+4 భద్రతతో పాటూ ఎస్కార్ట్ ఉండాలని సూచించింది. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన నేపథ్యంలో రేవంత్‌కు కల్పిస్తున్న భద్రతను పోలీస్‌ శాఖ ఉపసంహరించుకుంది. అలాగే, కాంగ్రెస్‌, బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను దశలవారీగా ఉపసంహరించనున్నారు.

ఇదిలా ఉంటే, తాజా ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. కొడంగల్‌లో కేసీఆర్‌ను అడుగుపెట్టనివ్వనంటూ సవాల్ విసిరారు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రాదని, కాళగర్భంలో కలిపేస్తామని వ్యాఖ్యానించారు. కానీ, రేవంత్ చెప్పింది ఏమీ జరగకపోగా ఆయనకే నష్టాన్ని తెచ్చిపెట్టింది. కారు జోరుకి కుదేలైన రేవంత్.. తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.