యాప్నగరం

TRS Meeting: నేడే ప్రగతి నివేదన సభ.. దారులన్నీ కొంగరకలాన్ వైపే

రైతుల, కార్యకర్తలు, మహిళలూ అందరూ.. రాజధాని బాటపట్టారు! ప్రగతి నివేదన సభ ద్వారా గులాబీ దళపతి కేసీఆర్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో రాజకీయంగానూ వేడి పుట్టింది.

Samayam Telugu 2 Sep 2018, 12:14 am
టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి నివేదన సభకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పల్లెలన్నీ ఇప్పుడు కొంగరకలాన్ వైపే తరలుతున్నాయి. రైతుల, కార్యకర్తలు, మహిళలూ అందరూ.. రాజధాని బాటపట్టారు! గులాబీ దళపతి కేసీఆర్ ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో రాజకీయంగానూ వేడి పుట్టింది.
Samayam Telugu trs


తమ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈ సభ ద్వారా ప్రజలకు బలంగా చాటిచెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ ‘ప్రగతి నివేదన’ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శనివారం రాత్రి వరుణుడి రూపంలో కాస్త ఇబ్బంది తలెత్తినా కార్యకర్తలు ఉత్సాహంగా సభా ప్రాంగణంవైపు సాగుతున్నారు.

కొంగరకలాన్ వేదికగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభలో 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్నవారు కూడా సభను తిలకించేందుకు వీలుగా 50 భారీ ఎల్ఈడీ తెరలను అమరుస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. హెలీప్యాడ్‌తో పాటు మొబైల్ ఫోన్ సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేశారు.

సభా ప్రాంగణంలో మొత్తం 15000 ఎల్‌ఈడీ, హాలోజన్‌ దీపాలను బిగిస్తున్నారు. వీటి కోసం 300 టవర్లు, 600 స్తంభాలు ఏర్పాటు చేశారు. విద్యుత్తు సరఫరా కోసం మూడు విద్యుత్తు ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా మరో 200 జనరేటర్లు సిద్ధం చేశారు. 50 లక్షల చదరపు అడుగుల మేర గ్రీన్‌ కార్పెట్‌ వేస్తున్నారు.
జిల్లాల వారిగా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేక రోడ్లు వేశారు. జేసీబీలు, రోడ్డు రోలర్లు, బుల్డోజర్లతో రేయింబవళ్లు పనులు చేశారు. సభకు 25 లక్షల మందికి పైగా వచ్చినా ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేసినట్లు నేతలు చెబుతున్నారు. సభకు వచ్చిన వారంతా క్షేమంగా ఇంటికి తిరిగెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యే రసమయి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీ చరిత్రను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొంగరకలాన్‌‌కు వచ్చే రహదారులన్నీ గులాబీమయంగా మారాయి.

పక్కా ప్రణాళిక.. ఎమర్జెన్సీ ఏర్పాట్లు
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సభాస్థలికి 15 రోడ్లతో అనుసంధానం చేశారు. సభాస్థలి ప్రాంతంలో మల్లారెడ్డి వైద్య కళాశాల, నారాయణ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 30 అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు. 100 మంది వైద్యులు, 150 మంది నర్సులతో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సభా ప్రాంగణం నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా 20 స్పెషల్ అంబులెన్స్ సిద్ధంగా ఉంచనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.