యాప్నగరం

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ చదువుతోన్న తెలుగు విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 26 Oct 2018, 9:57 am
ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతోన్న తెలుగు విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నకిరికల్ మండలం బెల్లగుండకు చెందిన హనిమిరెడ్డి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేస్తోన్న హనిమిరెడ్డి ఐఐటీ ప్రాంగణంలోని మదన్‌మోహన్ మాలవ్యా హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి అతడు అనుమానాస్పద రీతిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు మిత్రులు చెబుతున్నారు. బుధవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో హనిమిరెడ్డి స్నేహితులు అతడి గదికి వచ్చి పిలిచారు. వారి ఎంతగా పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా హనిమిరెడ్డి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడిని వెంటనే కిందకు దించిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu student suicide


అయితే, హనిమిరెడ్డి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హనిమిరెడ్డి తల్లిదండ్రులకు ఐఐటీ అధికారులు సమాచారం అందజేయడంతో వారు ఖరగ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా దీనిని పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని గుంటూరులోని అతడి స్వస్థలానికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.