యాప్నగరం

ఇత్తడి పుత్తడి ముఠాను సీసీ కెమెరా పట్టించింది

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.13లక్షలు కాజేసిన ముఠాను హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 2 Dec 2018, 12:41 pm
నేటి సమాజంలో తప్పుడు ప్రచారాలతో, మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఎన్ని స్కాములు బయటపడినా, ఎందరు కేటుగాళ్లు అరెస్టయినా ప్రజల్లో మార్పు రానంతవరకు ఇలాంటి సంఘటనలు ఆగవు. తాజాగా తక్కు ధరకే బంగారం ఇస్తామంటూ ఓ ముఠా.. రైతు వద్ద రూ.లక్షలు కాజేసింది.
Samayam Telugu thiefs


తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.13లక్షలు కాజేసిన ముఠాను హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ నాగరాజు కథనం ప్రకారం... నెలరోజుల క్రితం బళ్లారికి చెందిన ముఠా బడంగ్‌పేట పురపాలకలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన రైతు శ్రీనివాస్‌రెడ్డికి మాయమాటలతో తక్కువ ధరకే మూడు కేజీల బంగారం ఇస్తామని నమ్మించారు. దీంతో అతను రూ.13 లక్షలు వారికివ్వగా నకిలీ బంగారం అందజేసి మాయమయ్యారు. అది నకిలీదని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సదరు ముఠా బళ్లారి వాసులని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీనిపై బాలాపూర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలింగ్ సమీపిస్తుండటంతో పోలీసులు ఇటీవల ఠాణా పరిధిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. ఈ కెమెరాల్లో ఇత్తడి పుత్తడి ముఠాతో వారి కారు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వెంటనే బళ్లారికి వెళ్లిన పోలీసులు నిందితుల కోసం వేటాడగా ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుడి వద్ద రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని శనివారం రిమాండ్‌కు తరలించారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.