యాప్నగరం

లెక్చరర్లు కొట్టారని.. ఎంత పని చేశాడు!

లెక్చరర్లు కొట్టారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి అయిదంతస్తుల భవనం పైనుంచి కిందకి దూకేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన ఆ కుర్రాడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట జనప్రియా..

TNN 13 Sep 2017, 4:13 pm
లెక్చరర్లు కొట్టారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి అయిదంతస్తుల భవనం పైనుంచి కిందకి దూకేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన ఆ కుర్రాడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట జనప్రియా మహానగర్‌ 3వ బ్లాక్‌లో ఉండే వింజమూరి మాణిక్‌ప్రభు, విజయశ్రీ దంపతుల కుమారుడు సంజయ్‌ (17) చంపాపేటలోని శ్రీగాయత్రి జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం (సెప్టెంబర్ 11) తరగతి గదిలోని బెంచ్‌పై అసభ్యకర మాటలు రాశాడని కొంత మంది విద్యార్థులు సంజయ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో లెక్చరర్లు అతడిని కొట్టినట్లు సమాచారం.
Samayam Telugu thrashed by lecturers teen jumps off building
లెక్చరర్లు కొట్టారని.. ఎంత పని చేశాడు!


తీవ్ర మనస్తాపానికి గురైన సంజయ్‌.. కాలేజీ నుంచి సాయంత్రం 7 గంటలకు తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్లకుండా నేరుగా అయిదో ఫ్లోర్‌పైకి వెళ్లాడు. తనను లెక్చరర్లు కొట్టారని, తరగతిలోనే తీవ్ర అవమానం జరిగినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని భవనం పైనుంచే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు. తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే లోపే సంజయ్‌ కిందకు దూకేశాడు.

భవనం పక్కనే ఉన్న ఇసుక కుప్పలపై పడటంతో సంజయ్.. ప్రాణాలతో బయటపడ్డాడు. కాళ్లు, తలకు తీవ్ర గాయాలైన ఆ కుర్రాడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంచీ మీద సంజయ్.. ఓ అమ్మాయి గురించి అసభ్యంగా రాశాడని, ఈ విషయమై తల్లిదండ్రులను కాలేజీకి తీసుకురావాలని, లేకపోతే టీసీ ఇచ్చేసి పంపిస్తామని చెప్పామే తప్ప కొట్టలేదని కాలేజీ ప్రిన్సిపాల్ రోహిత్ తెలిపారు.

మరోవైపు లెక్చరర్ల వేధింపులతోనే సంజయ్‌ ఆత్మహత్యకు యత్నించాడని విద్యార్థి సంఘం నాయకులు కాలేజీ ముందు దర్నా నిర్వహించారు. ఈ ఘటనకు కారకులైన లెక్చరర్లు వంశీ, రోహిత్‌, సందీప్‌‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సంజయ్ వైద్య ఖర్చులు భరిస్తామని, అతడికి కాలేజీలో ఉచితంగా చదివే అవకాశం కల్పిస్తామని శ్రీగాయత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.