యాప్నగరం

కడపలో కారును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

కడప జిల్లాలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బద్వేలు సమీపంలోని జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

Samayam Telugu 1 Jul 2018, 10:44 am
కడప జిల్లాలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బద్వేలు సమీపంలోని జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బద్వేలు మండలం మడకలవారిపల్లి సమీపంలోని సుదర్శన ఆశ్రమం వద్ద కారు, లారీ ఢీకొట్టిన ఘటనలో భార్య భర్తలతో సహా డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అనంతపురం పట్టణం రామనగర్‌‌కు చెందిన కంభం వెంకటరామిరెడ్డి, ఆయన భార్య సుజాత, డ్రైవర్ మధుగా గుర్తించారు. వీళ్లు అనంతపురం నుంచి తమ వాహనంలో వెళ్తుండగా సుదర్శన ఆశ్రమం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తోన్న వాహనాన్ని నెల్లూరు నుంచి తాడిపత్రికి వస్తున్న ఇనుప ఖనిజం లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వెంకటరామిరెడ్డితోపాటు, ఆయన భార్య, డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Samayam Telugu కడప రోడ్డు ప్రమాదం


కారును లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో లోపల చిక్కుకుపోయిన మృతిదేహాలను అతికష్టంమీద బయటకు తీశారు. బాధితుల మొబైల్ సాయంతో వారి వివరాలను సేకరించిన పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.