యాప్నగరం

జెనీవాలో వేలానికి వచ్చింది శ్రీవారి గులాబీ రంగు వజ్రమేనా ?

మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయారు ఐదు పేటల ప్లాటినం హారం సమర్పించారు. అందులోని పతకం మధ్యలో గులాబీ రంగు వజ్రం ఉండేది. 2001లో గరుడ వాహన సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేలు తగిలి ఆ వజ్రం పగిలిపోయిందని రికార్డ్ చేశారు.

Samayam Telugu 20 May 2018, 4:35 pm
శ్రీవారి ఆలయంలోని తిరువారభణాలు భద్రంగా ఉన్నాయో లేదో తెలియదని ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు మరోసారి ఆరోపణలు చేశారు. పల్లవులతో మొదలుపెట్టి.. విజయనగర రాజులు, మైసూర్ మహారాజుల వరకు గతంలోనే తిరుమలేశుడికి విలువైన ఆభరణాలు సమర్పించారని, అర్చకుల మిరాసీ విధానం రద్దయ్యాక వాటి భద్రత కొరవడిందని ఆయన తెలిపారు.
Samayam Telugu ttd


తిరువాభరణాలను అనాదిగా నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు రక్షించారు. వీరంతా వంతుల వారీగా విధులు నిర్వర్తించేవారు. బ్రహ్మోత్సవం మొదటి రోజుతో వంతుల ప్రక్రియ ప్రారంభం అయ్యేది. బ్రహ్మోత్సవాలు ముగిశాక హాల్వంతుదారు (తిరువాభరణాల బాధ్యతలు తీసుకునేవారు)కు సాల్వంతుదారులు (నగదల బాధ్యతలను అప్పటికి ముగించిన వారు) వివరాలతో సహా తిరు ఆభరణాలు అప్పగించేవారు. టీటీడీ అధికారులు, నగల నిపుణులు, దేవాలయ సిబ్బంది సమయంలో దాదాపు 25 నుంచి 30 రోజులపాటు జరిగే ఈ ప్రక్రియను జర్తీ అంటారు.

పోటును మూసేశారు, శ్రీవారిని పస్తులుంచారు

పరకామణి జరిగే మంటపంలో భక్తులంతా చూస్తుండగానే ఇది జరిగేది. ఏ వస్తువైనా, ఆభరణంలోని భాగమైనా కనిపించకపోతే రికార్డు చేసేవారు. విలువైన రత్నాలు కనిపించకపోయినా, బంగారు ముక్కలు, కొండీలు కనిపించకుండా పోతే.. వాటి విలువను సాల్వంతుదారుకి దేవాలయం నుంచి రావాల్సిన బిల్లు నుంచి మినహాయించే వారు.

1996లో మిరాసి రద్దు జరిగే వరకు ఇలాగే జరిగింది. తర్వాత ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఆభరణాలను సరి చూస్తోందెవరు..? వాటిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారా..? అనే వివరాలేవీ బహిర్గతం కాలేదు. పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.

చదవండి: తిరుమల దేవాలయం ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుందేమో

మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయారు ఐదు పేటల ప్లాటినం హారం సమర్పించారు. అందులోని పతకం మధ్యలో గులాబీ రంగు వజ్రం ఉండేది. 2001లో గరుడ వాహన సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేలు తగిలి ఆ వజ్రం పగిలిపోయిందని రికార్డ్ చేశారు. గోల్కోండ గనుల్లో దొరికిన అరుదైన ఆ గులాబీ రంగు వజ్రం ఎంతో విలువైంది. ఎంతో దృఢంగా ఉండే వజ్రం నాణేలు తగిలిపోవడం అనేది అసత్యం. వజ్రం స్థానంలో పగడం ఉంచారు.

ఇటీవల జెనీవాలో ఓ గులాబీ రంగు వజ్రాన్ని భారీ ధరకు వేలం వేశారు. అది స్వామి వారి దగ్గరున్న వజ్రాన్ని పోలి ఉంది. రెండూ ఒకటేనని నా అనుమానం. 1996 తర్వాత ఎన్ని మణులు మాణిక్యాలు మాయమయ్యాయి. తిరువాభరణాల విషయమై ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో విచారణ చేయించారు. లోతైన విచారణ చేపట్టకుండానే ఆభరణాలన్నీ సరిగా ఉన్నాయని వారు నివేదిక ఇచ్చారు. కానీ జెమాలజిస్టుతో విచారణ చేపడితేనే నిజాలు బయటకు వస్తాయి. అతి ప్రాచీన నగలు మన సంపద. వాటిని కాపాడాలి’ అని రమణ దీక్షితులు కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.