యాప్నగరం

Titli Cyclone: మండలానికో మంత్రి.. ఊపందుకున్న నిత్యావసరాల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాపై తిత్లీ తుఫాను విరుచుకుపడి పెను నష్టాన్ని మిగిల్చింది. ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించి, భారీ గాలులతో పంటలకు అపార నష్టం వాటిళ్లింది.

Samayam Telugu 17 Oct 2018, 10:37 am
తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రవాణా కొంత మెరుగుపడటంతో గ్రామాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ వేగం పుంజుకుంది. ప్రధాన విద్యుత్తు లైన్ ఇచ్ఛాపురం వరకు సిద్ధం కావడంతో సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మండల కేంద్రాలకు సరఫరాను పునరుద్ధరించి, అక్కడి నుంచి గ్రామాలకు ఇవ్వాలని భావిస్తున్నారు. మంగళవారం పోలాకి మండలంలో 23 గ్రామాలకు, సంతబొమ్మాళిలో 19 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు తుఫాను నష్టం అంచనాలు కూడా ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రానికల్లా నిత్యావసరాల పంపిణీని, అక్టోబరు 20 నాటికి తుఫాను నష్ట అంచనాలను తేల్చాలని యంత్రాంగం కృతనిశ్చయంతో ఉంది. పది మంది మంత్రులు జిల్లాలోనే మకాం వేశారు.
Samayam Telugu sklam


కూలిపోయిన 35వేల విద్యుత్ స్తంభాల్లో దాదాపు 65శాతం తిరిగి నిలబెట్టారు. మారుమూల గ్రామాలకు 2.5లక్షల కొవ్వొత్తులు సరఫరా చేశారు. మరో 70వేలు అదనంగా తెప్పిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ పరిహారాలను ప్రభుత్వం ప్రకటించడంతో నిత్యావసరాలు, నష్టపరిహారాలు తమకు ఎక్కడ అందకుండా పోతాయోనని పలుచోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్‌తో సహా ఎవరినీ తన వెంట రావద్దని స్పష్టం చేసిన చంద్రబాబు, నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మంత్రలు నారా లోకేష్‌, నారాయణ, సోమిరెడ్డి, కళా, అచ్చెన్నతో సహా పదిమంది పైగా మంత్రులు జిల్లాలోనే తిష్టవేశారు. వీరితోపాటు 37 మంది ఐఎఎస్‌ అధికారులు, 92 మంది డిప్యూటీ కలెక్టర్లు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

ఒక్కో మండలాన్ని ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇచ్ఛాపురం- కాలవ శ్రీనివాసులు, మందస- నారా లోకేష్‌, సంతబొమ్మాళి- పితాని సత్యనారాయణ, వజ్రపుకొత్తూరు- కొల్లు రవీంద్ర, కంచిలి- పత్తిపాటి పుల్లారావులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో చూసుకుంటున్నారు. విద్యుత్తు శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు విద్యుత్తు పునరుద్ధరణకు ఉద్దానంలో పర్యటిస్తున్నారు. హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప వివిధ మంత్రులను సమన్వయం చేసుకుంటున్నారు. నెల్లూరుతో సహా ఇతర జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 70 వరకూ అగ్నిమాపక వాహనాలు ఉద్దానంలో గ్రామాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.