యాప్నగరం

Kodandaram: రజత్‌ కుమార్‌పై అనుమానాలు.. ఫిర్యాదు చేస్తాం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పనితీరుపై అనుమానాలు ఉన్నాయన్నారు.

Samayam Telugu 12 Jan 2019, 10:36 pm
తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని టీజేఎస్ (తెలంగాణ జన సమితి) అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విఫలమైందన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌పై పలు అనుమానాలు ఉన్నాయన్న కోదండరామ్.. ఆయణ్ని పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగించవద్దన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శనివారం (జనవరి 12) మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ సందర్భంగా కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ko


సర్పంచ్‌ల ఏకగ్రీవం రాజకీయ స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులాంటిదని కోదండరామ్ అన్నారు. గ్రామానికి చెందిన ప్రజలంతా కలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నకోవడం మంచిదే కానీ, రాజకీయ పెత్తనంతో ఈ నిర్ణయం చేయడం తగదని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేస్తోందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్పం‌చులకు గ్రామ పంచాయతీ విధుల పట్ల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రస్తుతం పార్టీలకు, రాజకీయ నాయకులకు సిద్ధాంతపరమైన విధానాలు లేకుండా పోయాయని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం బట్టలు మార్చినంత తేలిగ్గా పార్టీలను మార్చేస్తున్నారని అన్నారు. టీజేఎస్ ప్రత్యేక రాజకీయ పక్షంగా ఉంటుందని.. ఏ పార్టీలో విలీనం కాదని కోదండరామ్‌ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.