యాప్నగరం

టీజేఎస్ బిజినెస్ సెంటర్‌ టికెట్లు అమ్ముకుంటున్నారు: మహిళా నేత జ్యోత్స్న

తెలంగాణ జనసమితి పార్టీలోనూ టికెట్ల లొల్లి మొదలయ్యింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత ప్రొఫెసర్ జ్యోత్స్న.. నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.

Samayam Telugu 11 Sep 2018, 3:26 pm
తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)లో అసమ్మతి రేగింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వేటలో ఉండగానే ఆ పార్టీకి మహిళా నేత షాకిచ్చారు. పార్టీలో మహిళలకు అన్యాయం జరుగుతోంది.. టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆమె మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జ్యోత్స్న.. టీజేఎస్‌ ఓ బిజినెస్ సెంటర్‌గా మారిందని ఆరోపించారు. దిలీప్‌ కుమార్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఆయనకు పార్టీలో అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
Samayam Telugu Jyosthna


పార్టీలో మహిళలకు అవమానం జరుగుతోందన్నారు జ్యోత్స్న. తనపై దాడి చేసేందుకు కూడా కొందరు ప్రయత్నించారని.. తనకు, తన భర్తకు ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయన్నారు. పార్టీలో అవమానించిందే కాక.. అంబర్‌పేట టికెట్ ఇవ్వకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు కోదండరాం లక్ష్యాలవైపు పార్టీ నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మరికొందరు పార్టీ నుంచి బయటకు వస్తారని చెప్పారు జ్యోత్స్న.

టీజేఎస్‌కు జ్యోత్స్న రాజీనామా చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు కలకలంరేపుతున్నాయి. జ్యోత్స్న చేసిన ఆరోపణలపై కోదండరాం కాని.. పార్టీ నేతలు కాని ఇప్పటి వరకు స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.