యాప్నగరం

ఏఓబీలో ఎదురుకాల్పులు.. మహిళా మావోయిస్టు హతం

కిడారి, సోమల హత్యతో విశాఖ మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రశాంతంగా ఉన్న మన్యంలో మావోలు మరోసారి మెరుపు దాడికి పాల్పడటంతో రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది.

Samayam Telugu 12 Oct 2018, 11:27 am
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యానంతరం మావోయిస్టుల కోసం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య తర్వాత పలువురు నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఓబీలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. తాజాగా పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా అండ్రపల్లి వద్ద పోలీసులకు మావోయిస్టు తారసపడ్డారని, ఈ సందర్భంగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో మృతి చెందిన మావోయిస్టును రానా అనే మహిళగా గుర్తించామని వెల్లడించారు. కిడారి, సోమ హత్యల తర్వాత ఏఓబీలో మావోయిస్టుల ఏరివేతకు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్ర, ఒడిశా పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు.
Samayam Telugu ఏఓబీలో ఎదురుకాల్పులు


ఇందులో భాగంగానే గత ఆదివారం ఒడిశా ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా మావోయిస్టు అగ్ర నేతలు తృటిలో తప్పించుకున్నారు. వారిలో అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే, చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అరుణ అలియాస్‌ వెంకటరవి చైతన్యలు ఉన్నారు. కొరాపూట్‌ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్కల్‌ములి అటవీ ప్రాంతంలో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటుచేసుకున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.