యాప్నగరం

ప్రజాప్రతినిధుల హత్యలకు నిరసనగా మన్యంలో నేడు బంద్

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడిని ఎస్సీ, ఎస్టీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Samayam Telugu 24 Sep 2018, 8:42 am
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై ఆదివారం ఉదయం దాడిచేసిన మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. కిడారి, సోమ హత్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారి హత్యలకు నిరసనగా గిరిజన సంఘాలు మన్యం బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అరకు, పాడేరు, డుంబ్రిగూడ వెళ్లే ఆర్టీసీ సర్వీసులను రద్దుచేశారు. వ్యాపార సంస్థలు కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ సంఘాలు సైతం మావోయిస్టుల చర్యలను తీవ్రంగా గర్హించాయి. మరోవైపు అరకులో సివేరి సోమ అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలాన్ని కేటాయించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఐదెకరాల భూమి కేటాయించి, ఇందులోనే ఆయన స్మారకచిహ్నం ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.
Samayam Telugu అరకు ఎమ్మెల్యే కిడారి


మన్యం బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన భద్రతా దళాలు, గిరిజన గ్రామాల్లో జల్లెడ పడుతున్నాయి. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యేలపై దాడి జరిగిన ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి నుంచి గ్రేహౌండ్స్ కూంబింగ్ చేపట్టింది. కిడారి, సివేరి హత్యతో రగిలిపోయిన వారి అనుచరులు, గిరిజనులు పోలీస్‌ స్టేషన్లు, పోలీసులపై దాడికి పాల్పడ్డిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచే సిట్ బృందం విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పండి ఎవరనేదానిపై దర్యాప్తు చేసి, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.