యాప్నగరం

TRS: కేసీఆర్‌తో సీఎస్, ఎమ్మెల్యేల భేటీ, అంతటా ఉత్కంఠ

ముందస్తు ఎన్నికలపై రాష్ట్రంలో వాడీ వేడీ వాతావరణం నెలకొంది. గురువారం సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Samayam Telugu 5 Sep 2018, 10:08 pm
సీఎం కేసీఆర్.. అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ ముందస్తుపై ప్రకటన చేస్తారని భావించినా, ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, గురువారం తప్పకుండా కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది.
Samayam Telugu 1447399904-kcr-gives-nod-to-fill-vacancies-the-siasat-daily


ఈ నేపథ్యంలో కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే సీఎం.. సీఎస్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని తెలుస్తోంది. బుధవారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం గవర్నర్‌తో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను సీఎస్.. ముఖ్యమంత్రికి వివరించారని తెలిసింది.

సీఎం మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలపై వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని వారిని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ముందస్తుపై ఎప్పుడైనా ప్రకటన రావచ్చని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేయాలని చెప్పారని సమాచారం. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశం తర్వాత మరోసారి భేటీ ఉంటుందని సీఎం వారికి సూచించినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.