యాప్నగరం

రమణ దీక్షితుల ఆరోపణలు.. టీటీడీ ఈవో క్లారిటీ

రమణ దీక్షితుల ఆరోపణలు, అర్చకుల రిటైర్మెంట్ వివాదంపై టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ స్పందించారు.

Samayam Telugu 20 May 2018, 7:10 pm
రమణ దీక్షితుల ఆరోపణలపై టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ స్పందించారు. స్వామి వారి ఆభరణాల విషయంలో పారదర్శకత లోపించిందని, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటించడం లేదని, పోటును తొలిసారిగా మూసేశారని రమణ దీక్షితులు విమర్శించి నేపథ్యంలో.. సింఘాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తిరువాభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వాద్వా, జగన్నాథ కమిటీల రిపోర్టులను ప్రస్తావించిన ఆయన.. ఆగమ సలహా మండలి అంగీకరిస్తే.. ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచుతామన్నారు.
Samayam Telugu ttd-dispute


2001లో గరుడ వాహన సేవ సందర్భంగా గులాబీ వజ్రం పగిలిపోయిందని రిపోర్ట్‌లో ఉందని రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సరికావని సింఘాల్ చెప్పారు. ఆ సమయంలో పగిలింది రూబీ అని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదిక తేల్చిందన్నారు. పగిలిన రూబీ ముక్కలు ఇప్పటికీ టీటీడీ దగ్గర భద్రంగా ఉన్నాయన్నారు.

65 ఏళ్లు దాటిన అర్చకుల రిటైర్మెంట్‌పై కూడా సింఘాల్ స్పందించారు. 2012లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. అప్పుడు రిటైరైన ముగ్గురు అర్చకులు కోర్టుకు వెళ్లారు. కానీ జీతభత్యాలు లేకుండా అర్చకత్వం చేసేలా కోర్టు తీర్పునిచ్చిందని సింఘాల్ తెలిపారు. వయోపరిమితి కింద తొలగించిన వారి వారసులనే తిరుమలలో అర్చకులుగా నియమించామని సింఘాల్ చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయం పోటు మరమ్మతుల విషయమై సింఘాల్ వివరణ ఇచ్చారు. ఇటీవలే కాకుండా 2001, 2007లోనూ శ్రీవారి పోటుకు మరమ్మతులు చేశామన్నారు. పోటులో తవ్వకాలు జరిపారన్న రమణ దీక్షితుల వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.

సుప్రభాత సేవ, తోమాల సేవల, నేవేద్యాలు త్వరగా చేయాలని తొందర పెడుతున్నారని రమణ దీక్షితులు విమర్శించిన నేపథ్యంలో.. తిరుమలేశుడి పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతున్నాయని ఈవో స్పష్టం చేశారు. స్వామి వారి ఆలయంలో సుప్రభాత సేవ 1971 నుంచి వేకువ జామున 3 గంటలకే ప్రారంభమైందన్నారు. ఆగమ సలహామండలి అంగీకరిస్తే.. తిరుమలేశుడికి జరిగే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని సింఘాల్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.