యాప్నగరం

పోలవరం దేశానికే ఆదర్శం.. ఏపీకి కొత్త జీవం ఇస్తుంది: గడ్కరీ

పోలవరం ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని కొనియాడారు. పోలవరం నిధుల విషయంలో భరోసా ఇచ్చారు.

Samayam Telugu 12 Jul 2018, 3:03 pm
పోలవరం ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని కొనియాడారు. పోలవరం నిధుల విషయంలో భరోసా ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య లేదని స్పష్టం చేశారు. బుధవారం (జులై 11) సాయంత్రం ఆయన పోలవరాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని గడ్కరీ అన్నారు. ఏప్రిల్‌ నాటికి సివిల్స్‌ వర్క్స్‌ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని తాను సూచించానని తెలిపారు.
Samayam Telugu polavaram


పోలవరానికి ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అడిగారని, ఆర్థిక శాఖతో చర్చించి వెల్లడిస్తామని గడ్కరీ తెలిపారు. సహాయ, పునరావాసంలో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గడ్కరీ పర్యటన సందర్భంగా టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

బీజేపీ, టీడీపీ మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఏపీ అభివృద్ధికి సంబంధించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు గడ్కరీ. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమని స్పష్టంచేశారు. నీటి సదుపాయం ఉంటే అన్నదాతలకు ఎంత మేలు జరుగుతుందో రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు తెలుసునని ఆయన తెలిపారు.

ముందస్తుగా నిధులు ఇవ్వండి.. సహకరించండి: చంద్రబాబు
2013 అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని, అందులో కేవలం భూసేకరణకే రూ. 33 వేల కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి 2019 డిసెంబర్‌ వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్టు చెప్పారు.

పోలవరానికి ఖర్చు చేసిన రూ.2200 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు. ముందస్తుగా నిధులు విడుదల చేయాలని, తద్వారా పనులు సకాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.