యాప్నగరం

వెంకయ్య చొరవతోనే ఏపీలో ఎన్ఐడీఎం: కిరణ్ రిజిజు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువని, వాటిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ విభాగం సమర్ధంగా నిర్వహించడం చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపత్తి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

Samayam Telugu 22 May 2018, 1:22 pm
ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువని, వాటిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ విభాగం సమర్ధంగా నిర్వహించడం చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపత్తి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ భవన నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవాళికి పెనుసవాల్‌గా పరిణమించాయని పేర్కొన్నారు. అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఏపీకి ఎన్‌ఐడీఎం లాంటి సంస్థలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో అనేక జాతీయ సంస్థల ఏర్పాటుకు కృషిచేసిన విషయాన్ని గుర్తుచేసిన వెంకయ్య, ఎన్‌ఐడీఎం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సూచించారు.
Samayam Telugu వెంకయ్యనాయుడు


అలాగే 15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన అవసరం లేదని వెంకయ్య అన్నారు. తమకు అన్యాయం జరుగుతుందన్న దక్షిణాది రాష్ట్రాల వాదనలపై స్పష్టత కోసం ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా సరిగ్గా పనిచేసే రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని వారు చెప్పినట్టు వెల్లడించారు. దీని గురించి పూర్తిస్థాయి వివరాలను వారి ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ కోసం రూ. 2 వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.

అందులో ఏపీకే సింహభాగం దక్కుతుందని రిజిజు స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు చొరవతోనే ఎన్ఐడీఎం ఏపీలో ఏర్పాటైందని అన్నారు. విపత్తు నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందుందని అభిప్రాయపడ్డ ఆయన, ముఖ్యంగా హుద్‌హుద్‌ సమయంలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ చాలావరకూ నష్టాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. కొండపావులూరులోని ఎన్‌ఐడీఎం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ సేవలు అందుతాయని తెలియజేశారు. అత్యున్నతమైన శిక్షణ అందించే ఈ కేంద్రాన్ని ఏడాదిలోగానే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.