యాప్నగరం

తొలితరం కమ్యూనిస్ట్ నేత, కొండపల్లి సీతారామయ్య సతీమణి కన్నుమూత

కమ్యూనిస్ట్ ఉద్యమకారిణిగా, రచయిత్రిగా, సాహితీవేత్తగా తనదైన ప్రత్యేకతను చాటాకున్న కొండపల్లి కోటేశ్వరమ్మ నేటి మహిళలకు ఎంతో ఆదర్శం. స్వశక్తితో ఎదిగి ఆత్మాభిమానంతో జీవించారు.

Samayam Telugu 19 Sep 2018, 1:52 pm
ప్రముఖ నక్సల్ నేత, పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ(100) బుధవారం కన్నుమూశారు. విశాఖలోని కృష్ణా కాలేజ్ సమీపంలో మనవరాలు అనురాధ ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గత ఆగస్టులో తన 100వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 10న కోటేశ్వరమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కొంచెం కుదుటపడటంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించారు.
Samayam Telugu కమ్యూనిస్ట్ నేత కొండపల్లి కోటేశ్వరమ్మ


కానీ, డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండటంతో బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ చివరి కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విశాఖ కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి అప్పగించనున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకురాలిగా ఉన్న కోటేశ్వరమ్మ అతివాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ‘నిర్జన వారధి’ అనే పుస్తకాన్ని ఆమె రాశారు. అంతేకాకుండా ఆమె మంచి గాయని కూడా. కాగా, కోటేశ్వరమ్మ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.

కొండపల్లి కోటేశ్వరమ్మకు కమ్యూనిస్టు చరిత్రలో ఓ అధ్యాయం ఉంది. ఏడేళ్ల వయసులో వితంతవుగా మారిన కోటేశ్వరమ్మ.. నాటి సామాజిక కట్టుబాట్లను ఎదురించి తొమ్మిదో ఏట కొండపల్లి సీతారామయ్యను పునర్వివాహం చేసుకున్నారు. కమ్యూనిస్ట్‌‌లు రెండుగా చీలిపోవడంతో అతివాద ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ప్రజా జీవితంతో మమేకమై ఉద్యమకారిణిగా, కళాకారిణిగా, కవయిత్రిగా, రచయిత్రిగా తనదైన ముద్రవేశారు. జాతీయోద్యమం, సంఘసంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషించిన ఆమె అజ్ఞాత వాసం గడిపారు. నిషేధకాలంలో కమ్యూనిస్టుపార్టీ అవసరాలకోసం నగలు అమ్మగా వచ్చిన డబ్బు పార్టీ ఆమెకు తిరిగి ఇవ్వబోతే, సీతారామయ్య దీనికి అంగీకరించలేదు.

ఇదే సమయంలో సీతారామయ్య ఆమె నుంచి దూరంగా వెళ్లిపోవడంతో ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో నిలబడాలని నిశ్చయించుకున్న కోటేశ్వరమ్మ, 35 ఏళ్ల వయసులో హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ చదవడానికి చేరారు. ప్రభుత్వం ఇచ్చిన ఉపకారవేతనం సరిపడక రేడియో నాటకాలు, కార్యక్రమాలలో పాల్గొంటూ కథలు రాసి ఖర్చులకు డబ్బులు సంపాదించేవారు. మెట్రిక్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పై చదువులకు ఆర్థికంగా సాయం అందకపోవడంతో కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గరల్స్ హాస్టల్లో మేట్రన్‌గా చేరారు. కాకినాడలో సాహిత్య సభలలో పాల్గొంటూ రచనావ్యాసంగం మొదలుబెట్టారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏనాడు కుంగిపోలేదు. దృడ సంకల్పంతో చివరి వరకూ తన నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారు. అంతేకాదు పీపుల్స్‌వార్ నుంచి బయటకొచ్చిన సీతారామయ్యను ప్రభుత్వం జైల్లో పెట్టిన సమయంలో సీతారామయ్యకు నిన్ను చూడాలని ఉందట... తీసుకువెళతాను వస్తావా అని ఓ బంధువు అడిగితే, ‘ఆయనకు చూడాలని ఉంటే.. నాకు ఆయన్ని చూడాలని ఉండొద్దా?.. లేదుగాబట్టి రాలేను’ అని జవాబిచ్చింది కోటేశ్వరమ్మ.

నన్ను అభిమానించే వాళ్లని ఎందరినో సంపాదించుకోగలిగాను. ప్రేమించేవారినీ పొందగలిగాను, వారి ఆత్మీయానురాగాలే నాకు కొండంత బలం. దాని ముందు నేను పడిన కష్టాలు చిన్నవైపోయాయి.. ఎంచుకున్న మార్గంలో రాజీపడకుండా నడిచి సంఘ సేవలో తరించానన్న సంతృప్తే నన్ను ఇప్పటికీ చురుగ్గా నడిపిస్తోందని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లడిన చివరి మాటలివి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.