యాప్నగరం

శ్రీవారి సేవలో వెంకయ్య.. సామాన్యుడిలా క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయం లోనికి!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు సేవచేసేందుకు మరింత శక్తి సామర్థ్యాన్ని, ఓర్పును ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు వెల్లడించారు.

Samayam Telugu 25 Sep 2018, 1:53 pm
తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి మహద్వారం వద్దకు వద్దకు చేరుకున్న వెంకయ్యకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీనివాసరాజు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, 2019 టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను ఉపరాష్ట్రపతికి అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నారు.
Samayam Telugu ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు. ప్రజలకు సేవచేసేందుకు మరింత శక్తి సామర్థ్యాన్ని, ఓర్పును ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు వెల్లడించారు. దేశ ప్రజలందరూ సిరి సంపదలతో, సుఖశాంతులతో ఉండేలా అశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నానని అన్నారు. సామాన్య భక్తుడిలాగానే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నానని, ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ స్వామివారి దర్శనం కోసం ఆసక్తి పెరుగుతోందన్నారు. ప్రముఖులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తమ రాకపోకలను కొంత తగ్గించుకొని సామాన్యులకు ఎక్కువ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ యాజమాన్యానికి, అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ విద్యాలయ వార్షికోత్సవాలకు వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలను భారతీయ విద్యాభవన్‌ సంస్థలు కాపాడుతున్నాయని, స్వరాజ్య పోరాట సమయంలోనూ ఈ సంస్థ ప్రచురించిన పుస్తకాలు వెలకట్టలేనివని కొనియాడారు. పుస్తకాలు నిజమైన జీవితాన్ని పరిచయం చేస్తాయని, ఇక్కడ పిల్లలను కలవడం వారితో మాట్లాడటం చాలా సంతోషానిచ్చిందని అన్నారు. చదువు కేవలం డిగ్రీలు, ఉపాధి కోసం కాకుండా మనోవిజ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉండాలని, సాధారణ విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తన చిన్నతనంలో తోటపని, మోరల్‌ సైన్స్‌ తరగతులుండేవి. ఇప్పుడు సైన్స్‌ ఉంది.. మోరల్‌ పోయిందని వెంకయ్యనాయుడు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.