యాప్నగరం

అత్తతో గొడవ.. ఆమె మరణ వార్త విని కోడలు మృతి

పురుగుల మందు తాగిన అత్త. ఆమె మరణ వార్త విని కుప్పకూలి మృతి చెందిన కోడలు.. కర్నూలులోని బండి ఆత్మకూరులోని విషాదం.

Samayam Telugu 2 Dec 2018, 10:35 pm
చిన్న విషయానికే వాగ్వాదం.. క్షణికావేశంలో పురుగుల మందు తాగిన అత్త.. ఆమె మరణవార్త విని కుప్పకూలి మృతి చెందిన కోడలు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూర్‌లో ఆదివారం (డిసెంబర్ 2) మధ్యాహ్నం చోటుచేసుకున్న విషాదమిది. కుటుంబ కలహాలతో అత్తాకోడళ్లు ఒకరి వెంట ఒకరు వరసగా మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu death


బండి ఆత్మకూర్ మండలంలోని సోమయాజుల పల్లె గ్రామానికి చెందిన కళావతి (48), వెంకట లక్ష్మి (28) అత్తాకోడళ్లు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.

అత్తాకోడళ్ల మధ్య గొడవ ముదరడంతో క్షణికావేశంలో అత్త కళావతి పురుగుల మందు తాగారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అత్త మరణ వార్త విన్న కోడలు వెంకట లక్ష్మి (28) ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.