యాప్నగరం

తల్లి క్షణికావేశం.. చిన్నారి బలి, ఆపై తానూ ఆత్మహత్య

ఏడాదిన్నర కూతురు అదే పనిగా ఏడుస్తుండటంతో ఆ తల్లి సహనం కోల్పోయింది. విచక్షణా రహితంగా ఆ చిన్నారిని కొట్టి, తోసేసింది. ఆ చిన్నారి నేలపై బలంగా పడిపోయి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

Samayam Telugu 21 May 2018, 6:04 pm
ఏడాదిన్నర కూతురు అదే పనిగా ఏడుస్తుండటంతో ఆ తల్లి సహనం కోల్పోయింది. విచక్షణా రహితంగా ఆ చిన్నారిని కొట్టింది. ఆపై బలంగా తోసేసింది. దీంతో ఆ చిన్నారి నేలపై బలంగా పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో హతాశయురాలైన ఆ తల్లి తన కారణంగానే కుమార్తె మృతి చెందిందని తీవ్ర మనోవేదనకు గురైంది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారకమైన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు పరిధిలోని కొండసముద్రం గ్రామంలో ఆదివారం (మే 20) జరిగింది.
Samayam Telugu mother


కందుకూరు పోలీసుల కథనం ప్రకారం.. కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ (23)ది పేద కుటుంబం. ఆమె భర్త మహేష్‌ తెలంగాణలోని జగిత్యాలలో బేల్దారి పనులు చేస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం భవ్యశ్రీ అత్తా, మామలు బయటకి వెళ్లారు. తన 18 నెలల కూతురు మహిషితతో కలిసి భవ్యశ్రీ ఇంట్లో ఒంటరిగా ఉంది.

కూతురు అదే పనిగా ఏడుస్తుండటం, ఇంటి పనులు చేసుకోకుండా విసిగిస్తుండటంతో భవ్యశ్రీ అసహనానికి గురైంది. క్షణికావేశంలో కూతురుపై చేయి చేసుకుంది. దీంతో ఆ చిన్నారి మృత్యువాతపడింది. తన కూతురు లేని జీవితం తనకు అవసరం లేదని దిగులు చెందిన భవ్యశ్రీ గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. అంతకుముందు ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా పాప లేని జీవితం నాకు అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టింది.

పొలం నుంచి తిరిగొచ్చిన అత్తామామలు ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న భవ్యశ్రీ మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి భవ్యశ్రీ మృతదేహాన్ని కిందికి దించారు. సమాచారం అందుకున్న కందుకూరు సీఐ నరసింహారావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read this in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.