యాప్నగరం

తెలుగు వేడుకకు సర్వసిద్ధం.. నేటి నుంచే మహాసభలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

TNN 15 Dec 2017, 8:54 am
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం కన్నులపండవగా జరగనున్న వేడుకలతో ఈ తెలుగు పండుగ ఆరంభంకానుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు మహాసభలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 19వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల ద్వారా తెలంగాణలో తెలుగు భాషావికాసం, సాహితీమూర్తుల ప్రతిభా విశేషాలను ప్రపంచానికి చాటనుంది.
Samayam Telugu world telugu conference begins in hyderabad today
తెలుగు వేడుకకు సర్వసిద్ధం.. నేటి నుంచే మహాసభలు


అదిరేలా వేదికల అలంకరణ..
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్న వేదికల అలంకరణ ఏర్పాట్లు గురువారం రాత్రి పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియంలో ప్రారంభవేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఎల్బీ స్టేడియాన్ని రూ.70 లక్షల ఖర్చుతో అందంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా వేదికను సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు పాల్గొంటారు.

నగరానికి చేరుకున్న అతిథులు..
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి ఇప్పటికే ఆరువేల మందికి పైగా అతిథులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. కవులు, రచయితలు, దేశ, విదేశీ అతిథుల కోసం ఎల్బీ స్టేడియంలో వేదిక వద్ద ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో తెలంగాణపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. అనంతరం ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తారు. ప్రసంగాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మొత్తం 7 వేదికలు..
ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్బీ స్టేడియంతో పాటు మరో ఆరు వేదికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో తెలుగు భాషా సదస్సులు, చర్చాగోష్ఠులు, కథాసాహిత్యం, నవల, విమర్శ, గేయం, బాల, మహిళా సాహిత్యాలు, చరిత్ర, పరిశోధన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. అష్టావధానం, హాస్యావధానం, జంట కవుల, నేత్ర, శతావధానాలు జరగనున్నాయి. ఈ మహాసభలకు 1500 మందికి పైగా కవులు హాజరవుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి 2000 మంది హాజరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.