యాప్నగరం

ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల కన్నుమూత

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు.

Samayam Telugu 18 May 2018, 6:45 pm
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(79) కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో 40 ఏళ్లపాటు అధ్యాపకునిగా పనిచేసిన సుబ్బరామయ్య.. 200కు పైగా కథలు రాశారు. ‘చక్రనేమి’ కథతో సాహితీ ప్రస్థానం ప్రారంభించిన సుబ్బరామయ్య అనేక అవార్డులు అందుకున్నారు. వీటిలో రవిశాస్త్రి సాహిత్య స్మారకనిధి అవార్డు, గోపీచంద్ స్మారక అవార్డు, అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్ అవార్డులు ఉన్నాయి.
Samayam Telugu Peddibhotla


పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)కు గానూ 2012లో ఆయన్ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. కాగా, 1938 డిసెంబర్ 15న గుంటూరులో పెద్దిభొట్ల జన్మించారు. ఒంగోలులో విద్యాభ్యాసం చేసిన సుబ్బరామయ్య.. కళాశాల విద్యను విజయవాడలో పూర్తిచేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలో ‘వేయిపడగలు’ రచయిత విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేశారు. ఆంధ్ర లయోలా కాలేజీలో లెక్చరర్‌గా 40 ఏళ్లపాటు పనిచేసిన పెద్దిభొట్ల 1996లో పదవీ విరమణ చేశారు. ఈయన కథలతో పాటు 8 నవలలను కూడా రచించారు.

‘పూర్ణాహుతి’, ‘దుర్దినం’, ‘శుక్రవారం’, ‘ఏస్‌ రన్నర్‌’, ‘వీళ్ళు’ (కథాసంకలనం) వంటి కథలు.. ‘ముక్తి’, ‘చేదుమాత్ర’ నవలలు పెద్దిభొట్లకు పేరు తెచ్చాయి. కాగా, పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఎన్నారై ఆస్పత్రి వర్గాల పెద్దిభొట్ల పార్థివదేహాన్ని స్వాధీనం చేసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.