యాప్నగరం

జగన్ జనంలోకి.. ఎమ్మెల్యేలు టీడీపీలోకి!

2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని కలగంటోన్న వైసీపీ అధినేత జగన్‌‌కు మరో ఎమ్మెల్యే షాక్ ఇస్తున్నారు.

TNN 26 Nov 2017, 4:15 pm
2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని కలగంటోన్న వైసీపీ అధినేత జగన్‌‌కు మరో ఎమ్మెల్యే షాక్ ఇస్తున్నారు. వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది టీడీపీలో చేరారు. వీరిలో అయిదుగురు మంత్రి పదవులను దక్కించుకున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే సోమవారం టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రజా సంకల్పయాత్ర పేరిటి వైసీపీ అధినేత పాదయాత్ర చేస్తుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ బాట పడుతున్నారు. కాసేపటి కిందట క్యాంపు కార్యాల‌యంలో తన అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులతో సమావేశమైన గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు విషయమై వారితో చర్చిస్తున్నారు. అమ‌రావ‌తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆమె టీడీపీలో చేరే అవ‌కాశం ఉంది.
Samayam Telugu ycp mla giddi eswari will join tdp on tomorrow
జగన్ జనంలోకి.. ఎమ్మెల్యేలు టీడీపీలోకి!


విశాఖ జిల్లాలో అభివృద్ధే తనకు ముఖ్యమని, కార్యకర్తల అభీష్టం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఈశ్వరి ఆదివారం ఉదయం ప్రకటించారు. జగన్‌‌పై విమర్శలు గుప్పించిన ఆమె, తాను పార్టీ మారితేనే పాడేరు అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ శ్రమిస్తోన్న తనలాంటి వారిని జగన్ పక్కనబెట్టడంతోనే మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుందని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించారు. అంతేకాదు వైకాపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణంగానే తాను పార్టీ మారాల్సి వస్తోందని ఈశ్వరి వ్యాఖ్యానించడం గమనార్హం.

పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వరి గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరకులో తాను చెప్పిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమించడం... నియోజకవర్గంలోనూ తన మాట కాకుండా వేరేవారికి ప్రాధాన్యతనివ్వడంతో ఆమె పార్టీ తీరుపై ఆవేదన చెందారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు.. అరకు ఎంపీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా రవిబాబుని నియమించడం.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని వైసీపీ నేతలు ప్రకటించడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ వారంలోనే మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ నేతలు ధ్రువీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.