యాప్నగరం

YSRCP Leader: విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలను అప్పగించారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిని నియమించారు.

Samayam Telugu 5 Jun 2019, 10:53 am
వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలను అప్పగించారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిని నియమించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ ఉత్తర్వులు వెలువరించారు. ఆయనతోపాటు లోక్‌సభలో వైసీపీ పక్షనేతగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ విప్‌గా రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్‌ రామ్‌లను నియమిస్తున్నట్టు ప్రకటించారు. వీరిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి జగన్ ప్రత్యేక లేఖను రాశఆరు. తమ పార్టీ తరఫున వీరిని గుర్తించాలని ఆ లేఖలో కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా విజయసాయి కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో మిథున్ రెడ్డి, భరత్‌లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి వరుసగా రెండోసారి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు.
Samayam Telugu Vijayasai-Reddy


కేంద్రంతో సంప్రదింపులు, బలమైన సంబంధాలు కొనసాగాలంటే సమర్ధవంతమైన వ్యక్తి అవసరమని గుర్తించిన జగన్, ఆ బాధ్యతలు విజయసాయి నిర్వర్తించగలరని భావిస్తున్నారు. అందుకే ఆయనను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. పార్టీలో కీలకనేతగా ఉన్న విజయసాయిరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఆయన్ను ఢిల్లీలో ఉంచడానికే జగన్ మొగ్గుచూపారు. విజయసాయి గత పదేళ్లుగా జగన్ వెన్నంటే ఉంటూ ఆయనకు కుడి భుజంలా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.