యాప్నగరం

యువకుడి ప్రాణం తీసిన ఇయర్ ఫోన్

ఇయర్ ఫోన్లో మాట్లాడుకుంటూ చూసుకోకుండా ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీకొన్న ఘటన సోమవారం కలకలం రేపింది.

Samayam Telugu 4 Dec 2018, 12:42 pm
నేటి సమాజంలో యువత సెల్‌ఫోన్లకు ఎంతలా బానిసలు అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లపై నడుచుకుని వెళ్తూనే ఎదురుగా ఎవరు వస్తున్నారో పట్టించుకోకుండా సెల్‌ఫోన్లు చూసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఎన్నో. కొందరు ఫోన్లో మాట్లాడుతూ, మరికొందరు ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ తరహాలోనే విశాఖపట్నం ఎన్‌ఏడీ కూడలి వంతెన కింద ఓ ఘటన జరిగింది. ఇయర్ ఫోన్లో మాట్లాడుకుంటూ చూసుకోకుండా ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీకొన్న ఘటన సోమవారం కలకలం రేపింది.
Samayam Telugu RailwayTrack


పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ బుచ్చిరాజుపాలెం రెడ్డివీధి ప్రాంతానికి చెందిన ఉప్పాడ అనిల్‌(22) అనే యువకుడు సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రైల్వేట్రాక్‌ సమీపానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఇటు దువ్వాడ నుంచి.. అటు కొత్తవలస వైపు నుంచి వచ్చే ట్రాక్‌లు కలుస్తాయి. ఆ సమయంలో వచ్చిన రైలు అటువైపు ట్రాక్‌పైకి వెళ్లిపోతుందని భ్రమించిన అనిల్‌ ఇటు వైపు పట్టాల పక్కన నిలబడ్డాడు. ఇంతలో ఆ రైలు అతడు నిల్చున్న ట్రాక్‌పైకి వచ్చేసింది. రైలు డ్రైవర్ హారన్ కొట్టినప్పటికీ చెవిలో ఇయర్‌ఫోన్‌ ఉండడం వల్ల అనిల్ ఆ శబ్దాన్ని గమనించలేకపోయాడు. దీంతో రైలింజన్ అనిల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. నేలకు బలంగా తాకడంతో తలకు రాళ్లు తగిలి అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.