యాప్నగరం

ఇంద్రకీలాద్రి పైనుంచి జారిపడ్డ యువకుడు.. జగన్ వచ్చి వెళ్లిన 10 నిమిషాల్లోనే

మిత్రులతో కలిసి మద్యం తాగి, ఇంద్రకీలాద్రిపై పేకాట ఆడుతున్న ఓ యువకుడు.. అటుగా పోలీసులు వస్తుండటం చూసి తప్పించుకోవడానికి పరుగెత్తాడు. ఈ క్రమంలో జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

Samayam Telugu 29 May 2019, 9:05 pm
బెజవాడ ఇంద్రకీలాద్రి పైనుంచి ఓ యువకుడు జారి కింద పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. దుర్గమ్మ వారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లిన 10 నిమిషాల్లోనే జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో కొంత ఆందోళనకు కారణమైంది. బుధవారం (మే 29) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి, కొండపై పేకాట ఆడుతున్న యువకుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu Srikanth
కొండ పైనుంచి జారిపడ్డ యువకుడు


విజయవాడ నగరంలోని మల్లికార్జునపేటకు చెందిన శ్రీకాంత్‌.. కొంత మంది మిత్రులతో కలిసి మద్యం సేవించి ఇంద్రకీలాద్రిపై నీటి ట్యాంక్‌ పక్కన పేకాట ఆడుతున్నారు. వైఎస్ జగన్‌ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది నీటి ట్యాంక్‌ వైపు రావడం గమనించిన శ్రీకాంత్, అతడి స్నేహితులు.. భయంతో కొండపై నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కొండ పైనుంచి కిందికి జారిపడ్డాడు.

బాధితుడు కొండ పైనుంచి పడిపోతుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను వన్‌టౌన్‌ సీఐ కాశీ విశ్వనాథ్ పోలీసు వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు పేకాట ఆడినట్లు పోలీసులు గుర్తించారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.