యాప్నగరం

ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే.. మళ్లీ రచ్చబండ: జగన్!

ఉండవల్లి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. అధికారులు నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.

Samayam Telugu 24 Jun 2019, 12:14 pm
అమరావతిలో జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మనం పాలకులం కాదని, సేవకులమనే విషయం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని పేర్కొన్నారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలని, పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.
Samayam Telugu collectors conference_1


మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని ప్రజలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, నా ద్వారా మీకు అధికారం ఇచ్చారన్నారు. ఏపీ చరిత్రలో ఇంత భారీ మెజారిటీ ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదని, ప్రజలు మనల్ని నమ్మరు కాబట్టి ఈ రోజు మనం అధికారంలో ఉన్నామని అన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలని వ్యాఖ్యానించారు. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలని, దీనికి మీ అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించి, స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారమవుతుందో రశీదు ఇవ్వాలని, అది పరిష్కారమైందో లేదో తెలపాలని ఆదేశించారు. రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు మారాలని, అన్ని స్కూల్స్ ఫోటోలు తనకు పంపాలని చెప్పారు. రైతులు, విద్య, వైద్యం తన ప్రాధాన్యత అంశాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, దీని ద్వారా తాను కూడా పాలనను పరిశీలిస్తానని అన్నారు. అధికారులు అకస్మాత్తుగా వారానికి ఒకచోట బసచేయాలని, స్కూల్ లేదా హాస్పిటల్‌లో నిద్రపోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఇళ్లు లేనివారు ఉండరాదని, పట్టా ఇచ్చి పొజిషన్ చూపకుండా ఉండొద్దని అన్నారు. ప్రభుత్వ భూమిలేకపోతే భూమి కొనుగోలు చేయాలని, ఇందుకు నిధులు మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వినాలని అన్నారు. మున్సిపాల్టీల్లో నీటి సరఫరాపై నీతిఆయోగ్ సమావేశంలో కేంద్రం చర్చించిన అంశాన్ని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చదవండి: ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం.. కూల్చేస్తాం : జగన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.