యాప్నగరం

పాదయాత్ర: సగం లక్ష్యానికి చేరువైన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దాదాపుగా సగం దూరానికి చేరుకుంటోంది.

TNN 7 Mar 2018, 2:24 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర దాదాపుగా సగం దూరానికి చేరుకుంటోంది. మూడు వేల కిలోమీటర్ల దూరం లక్ష్యంగా జగన్ ప్రజాసంకల్పయాత్రను చేపట్టారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్ల దూరానికి చేరువ అవుతోంది. రెండు రోజుల కిందట జగన్ 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా లో సాగుతూ ఉంది.
Samayam Telugu ys jagan padayatra to reach 1500 km
పాదయాత్ర: సగం లక్ష్యానికి చేరువైన జగన్


జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది. నేటితో పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ, ప్రజల కష్టనష్టాలను వింటూ.. వారితో మమేకం అవుతూ పాదయాత్రను సాగిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అలాగే వివిధ నియోజకవర్గాల్లో తన పార్టీ ఇన్ చార్జిలను, అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారాయన.

ప్రకాశం జిల్లా ప్రసంగాల్లో జగన్ మాట్లాడుతూ.. రైతాంగాన్ని ప్రభావితం చేసే హామీలను ఇస్తూ వస్తున్నారు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీలేని రుణాలను రైతులకు ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. అలాగే ప్రతియేటా పెట్టుబడి మొత్తం కిందట ఖరీఫ్ ప్రారంభంలో 12,500 రూపాయల మొత్తాన్ని రైతులకు అందజేస్తామని జగన్ ప్రకటిస్తున్నారు.

కడప జిల్లా ఇడుపులపాయ వద్ద నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లాను చేరుకుంది ప్రజాసంకల్పయాత్ర. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ జగన్ పాదయాత్ర సాగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.