ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు. శుక్రవారం జగన్ పాదయాత్ర జరగని విషయం తెలిసిందే. క్విడ్ ప్రో కో కేసుల విచారణకు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు జగన్. దీంతో ఒక రోజు విరామంతో జగన్ పాదయాత్ర మళ్లీ మొదలైంది. స్థూలంగా ఈ రోజు జగన్ పాదయాత్రకు ఐదో రోజు.
జగన్ పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాసంకల్ప యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి సామాన్య ప్రజానీకం నుంచి మంచి స్పందనే వ్యక్తం అవుతోంది. జగన్ పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున అగుపిస్తోంది.
ఈ రోజు జగన్ సుమారు 12.6 కిలోమీటర్ల దూరం నడవనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రొద్దుటూరు వరకూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సాగనుంది.