యాప్నగరం

దేశ రాజకీయాలెందుకు.. ఏపీ సమస్యలు పట్టించుకోవయ్యా 'బాబూ': జగన్

ఏపీ ప్రజల బాధలు, వారి సమస్యల్ని వదిలేసి.. కూటమి పేరుతో పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లో పర్యటనలు చేయడం అవసరమా .

Samayam Telugu 20 Nov 2018, 7:56 pm
ఏపీలో అరాచకపాలన సాగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. ఫించన్ నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు ప్రతిదానికి లంచం ముట్టజెప్పాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చివరికి అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారని ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం.. విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సర్కార్, చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.
Samayam Telugu jagan


ఏపీ ప్రజల బాధలు, వారి సమస్యల్ని వదిలేసి.. కూటమి పేరుతో పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు తిరుగుతున్నారని సెటైర్ పేల్చారు జగన్. జాతీయ స్థాయి నేతలతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల్లో పర్యటనలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకు.. సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు జగన్. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.

నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు.. ఏపీకి ఒక్క మంచిపనీ చేయించుకోలేకపోయారని మండిపడ్డారు జగన్. ఏపీ సమస్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లని ప్రభుత్వం.. రాష్ట్రంలో ఐటీ సోదాలపై మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆపరేషన్ గరుడ అని.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని అంటున్న చంద్రబాబు.. రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే అసలు విషయం బయటపడుతుందని బాబుకు భయమన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లి బాధితులకు సాయం విషయంలోనూ ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుందన్నారు జగన్. చేసిన సాయం కంటే చేసిన పబ్లిసిటీ ఎక్కువని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు వైసీపీ అధినేత. రాజధాని, విశాఖ భూములు, మట్టి, ఇసుకను కూడా వదలడంలేదని విమర్శించారు. కరెంట్‌ బిల్లు, పెట్రోల్‌ రేట్లు, ఆర్టీసీ ఛార్జీలు బాదుడు.. స్కూల్, కాలేజీల ఫీజులు పెంచేశారన్నారు. ఇలాంటి అవినీతి, దుర్మార్గపు పాలకులు అవసరమో లేదో ప్రజలు ఒక్క సారి ఆలోచించుకోవాలన్నారు జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.