యాప్నగరం

TTD: టీటీడీకి ఆ హక్కు లేదు.. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి: రోజా

శ్రీవారి ఆలయ మూసివేత నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఉదయం వెంకన్నను దర్శించుకున్న ఆమె టీటీడీ నిర్ణయంపై స్పందించారు. మహా సంప్రోక్షణ పేరుతో 9రోజులు ఆలయాన్ని మూసివేసే హక్కు టీటీడీకి లేదన్నారు రోజా.

Samayam Telugu 16 Jul 2018, 11:44 am
శ్రీవారి ఆలయ మూసివేత నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఉదయం వెంకన్నను దర్శించుకున్న ఆమె టీటీడీ నిర్ణయంపై స్పందించారు. మహా సంప్రోక్షణ పేరుతో 9రోజులు ఆలయాన్ని మూసివేసే హక్కు టీటీడీకి లేదన్నారు రోజా. తొమ్మిది రోజుల పాటూ ఆలయానికి ఎవర్నీ రావొద్దని పాలకమండలి ఎలా చెబుతుందని ప్రశ్నించారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ అయ్యాక ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రమణ దీక్షితులు చెబుతున్న విషయాలు నిజమేమోనని అనిపిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే.
Samayam Telugu Roja TTD


తిరుమలలో పరిణామాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేసేందుకు సిద్ధమయ్యారని.. అందుకే హడావిడిగా పాలకమండలి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు రోజా. మహా సంప్రోక్షణ జరిగే సమయంలో సీసీ కెమెరాలు ఆపేస్తామని చెబుతున్నారని.. ఇదంతా చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో శ్రీవారి భక్తులతో కలిసి నిరసన చేపడతామని హెచ్చరించారు రోజా.

రెండు రోజుల క్రితమే టీటీడీ పాలకమండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మహా సంప్రోక్షణ కోసం ఆగష్టు 9 ఉదయం నుంచి 17 సాయంత్రం 6 గంటలకు వరకు దర్శనాన్ని రద్దు చేశారు. అలాగే కొండపైకి భక్తుల్ని కూడా అనుమతించరు. 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు. ఈ నిర్ణయంపైనే రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.